యువకవి “ఎం.వి. పట్వర్ధన్” తెలంగాణ ఉద్యమంపై రచించిన దీర్ఘ కవిత – “జనాంతర్గామి”. ఎంతో ప్రభావవంతంగా గుండెల్లో నాటుకొనేలా అల్లిన ఈ కావ్యంలో చాలా పంక్తులు విశేషంగా ఆకట్టుకొంటాయి –
“మంచిది నాయనా! ఉద్యమమే లేదని వినోదించు! వినోదించు! నీ సమస్త సామ్రాజ్యాన్ని క్షిపణిలా పేల్చే దాకా!
ఇవాళ ఉద్యమానిది ఒక తల కాదు – ఒక పోకడ కాదు- వేయి పడగలు! వేల నడకలు!
మాకు తెలుసు మీరు చెప్పే దానిలో ఒక్క వాస్తవమూ లేదని – ఉద్యమాన్ని కించపరిచే సమయంలో పాలిపోయిన మీ ముఖ కవళికలే సాక్షి!
నిజం మా స్వరం – ఉద్యమం భాస్వరం!
మీ అనురాగ హస్తాలను మేం మాత్రం కాదంటామా? కలకాలం కలిసే ఉందాం – వేరు కాపురం పెట్టుకొని!
ఇక్కడకు రావాలంటే వీసాలేమీ అక్కర్లేదు – కడుపు లోతులో విషాలు లేకుంటే చాలు!
రెండయ్యేది రాష్ట్రమే తప్ప – అనురాగం కాదు! పరిపాలనా ప్రాంతమే తప్ప – మమకారం కాదు!
తయారుగా ఉండండి తప్పకుండా వేద్దాం – మన తెలుగు తల్లికి మల్లెపూల దండ! మా తెలంగాణ తల్లికి బంతిపూల దండ!”