దివంగత మహాకవి, ‘అభినవ పోతన ‘ – శ్రీమాన్ వానమామలై వరదాచార్యుల వారి సాహితీ విరాణ్మూర్తిమత్వాన్ని చిత్రిస్తూ సత్కవి శ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారి కలం నుండి జాలువారిన పద్యమది.
తెలంగాణ గడ్డపై ప్రభవించిన హిమ వన్నగ శిఖర స్థాయి ఆధునిక తెలుగు మహాకవులలో అగ్రేసర పంక్తిలో నిలిచే కవి పుంగవులు వానమామలై వరదాచార్యులు గారు. ప్రాచీన మహాకవి ‘పోతనామాత్యు’ని చరిత్రను బృహత్కావ్యంగా ఆ మహాకవి రచించిన విషయం జగద్విదితమే. ఇప్పుడు ఆ ఆధునిక మహాకవి వరదాచార్యుల వారి చరిత్రను ఒక సత్కావ్యంగా రచించి పాఠక లోకానికి అందించాలని పెండ్యాల కిషన్ శర్మ కవి సంకల్పించడం విశేషం! ముదావహం!!
అని మనసారా నమ్మి ఈ మహత్కార్యానికి ఉపక్రమించారు. ఆ నిష్ఠా నిధిత్వమే కిషన్ గారి ఈ ‘అభినవ పోతన’ చరిత్రమైన “శ్రీ వరద విజయము” కృతి – “తేనె నిండిన తీయని తెలుగు కుండ” గా రూపు దిద్దుకొనేందుకు దోహదపడింది.
ప్రస్తుత గ్రంథం “శ్రీ వరద విజయము” బృహత్కావ్య ప్రథమ భాగం మాత్రమే! ఈ భాగంలో .. వరదాచార్యుల వారి బాల్య దశ, కౌమార దశలో వాగీశ్వరీ వరప్రసాద ప్రాప్తితో కవిగా అవతరించడం, అనంతరం వివాహం వరకు చోటు చేసుకొన్నాయి.
శ్రీ పెండ్యాల కిషన్ శర్మ కవి – పోతన వలె, ‘అభినవ పోతన’ వలె సహజ కవి. ఆయన రచించిన పద్యాలన్నీ చిక్కని ధారతో, చక్కని శైలితో హృదయానికి హత్తుకొనేలా ఉన్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కృతిని చ(ది)వి చూసే పాఠకులు ఈ విషయాన్ని గ్రహిస్తారు.
తెలంగాణలో ఒక నానుడి ప్రచారంలో ఉండేది – “బ్రతికి బక్కయ్య శాస్త్రి పురాణం వినాలె .. చచ్చి స్వర్గానికి పోవాలె” అని. బక్కయ్య శాస్త్రి గారి కనిష్ట పుత్రులు వరదాచార్యులు గారు. ఆ తండ్రి గారి పుత్ర వాత్సల్యాన్ని కిషన్ శర్మ గారు వర్ణించిన పద్య రత్నం –
ఈ చిన్ని పద్యం – హిందూ వివాహంలోని ముహూర్త సన్నివేశాన్ని కళ్ళ ముందు నిల్పి, పాఠకుని కట్టిపడేస్తుంది.
వరదాచార్యుల వారిపై విరచించిన ఈ సత్కృతికి ఇట్లా నాలుగు మాటలు వ్రాసే మహద్భాగ్యం నాకు ప్రాప్తించడం కాకతాళీయం కాదేమోనని నా అంతరంగాంతర్గత భావన! వరదాచార్యుల వారితో నాకు బాంధవ్యం ఉంది. “అన్నయై మన వరదన్న కాదిగురువు, వెన్నునకు బలభద్రుని విధముగాను వెన్నుదన్నుగ నిల్చిన పెన్నిధి”యైన శ్రీమాన్ ‘వానమామలై జగన్నాథాచార్యుల’ వారి పెద్ద కోడలు – నా సతీమణికి స్వయాన జ్యేష్ఠ సోదరి. అందుకే ఈ కృతి నా చేతి కందగానే నేను సద్యః పులకాంకుర శరీరుడనై పరవశించాను.
చివరిగా ఒక్క మాట –
“మల్లెపూవులోని మంచి గంధము తెల్గు – కోకిలమ్మ తీపి కూత తెల్గు – ఇంద్రధనువులోని యేడు రంగులు తెల్గు – చంద్రకాంతిలోని సౌరు తెల్గు – ”
అన్న పద్యంలో కృతికర్త పెండ్యాల కిషన్ గారి అపరిమిత తెలుగు భాషాభిమానం ద్యోతకమౌతుంది.
కృతికర్త శ్రీ పెండ్యాల కిషన్ కవిని మనసారా అభినందిస్తూ – అతి త్వరలో మహాకవి ‘వానమామలై వరదాచార్యుల’ వారి చరిత్రం యొక్క మిగిలిన భాగాన్ని కూడ ఇంకా హృదయంగమంగా రచించి, సమగ్ర కావ్యంగా పాఠక లోకానికి అందించి, అశేష సాహిత్యాభిమానుల విశేషాదరణను పొందాలని ఆకాంక్షిస్తున్నాను.