తేనియల వరద

సాధారణం

                   తేనియల వరద

                                 – “పద్యకళాప్రవీణ”, ” కవి దిగ్గజ”

                                     డా. ఆచార్య ఫణీంద్ర

“ఆటపాటల నాడె యలవోకగా దెల్పె
‘దాగురింతల’ను విద్వాంసు లలర –
షోడషాబ్దంబులు శోభిల్లు తరుణమం
‘దాహ్వాన గీతంబు’ లాలపించె –
ఆంధ్ర భాషా యోష నర్చించె నతి భక్తి
‘మణిమాల’లం గూర్చి మహిత బుద్ధి -భారతావని కీర్తి భాసిల్ల జయ జయ
ధ్వానంబునన్ ‘జయధ్వజము’ నెత్తె –

మాటలా? కావు- ముత్యాల మూటలనుచు,
మూటలా? కావు- భావంపు తోటలనుచు,
తోటలా? కావు- ప్రగతికి బాటలనుచు
విశ్వనాథాది సత్కవుల్ వినుతి సేయ!”

దివంగత మహాకవి, ‘అభినవ పోతన ‘ – శ్రీమాన్ వానమామలై వరదాచార్యుల వారి సాహితీ విరాణ్మూర్తిమత్వాన్ని చిత్రిస్తూ సత్కవి శ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారి కలం నుండి జాలువారిన పద్యమది.

తెలంగాణ గడ్డపై ప్రభవించిన హిమ వన్నగ శిఖర స్థాయి ఆధునిక తెలుగు మహాకవులలో అగ్రేసర పంక్తిలో నిలిచే కవి పుంగవులు వానమామలై వరదాచార్యులు గారు. ప్రాచీన మహాకవి ‘పోతనామాత్యు’ని చరిత్రను బృహత్కావ్యంగా ఆ మహాకవి రచించిన విషయం జగద్విదితమే. ఇప్పుడు ఆ ఆధునిక మహాకవి వరదాచార్యుల వారి చరిత్రను ఒక సత్కావ్యంగా రచించి పాఠక లోకానికి అందించాలని పెండ్యాల కిషన్ శర్మ కవి సంకల్పించడం విశేషం! ముదావహం!!

“పల్కులు వేయు నేల? పరిపక్వత నొందిన బల్కు నొక్కటిం
బల్కిన చాలదా? – విబుధ వర్యులు మెచ్చు విధాన, తేనెలుం
జిల్కు విధాన, కోకిలలు చెల్వుగ బల్కు విధాన, శాంతియం
దొల్కు విధాన, సద్గుణ రసోచిత కావ్య వినూత్న సృష్టికిన్!”

అంటూ కావ్య లక్ష్య లక్షణ మర్మాలను క్షుణ్ణంగా ఆకళించుకొన్న కిషన్ శర్మ కవి –

“ఆతడె వరదాచార్యుడు –
పోతన వలె కీర్తిశాలి, పూత చరిత్రుం
డాతని గాథ విచిత్రము –
చేతో మోదంబు గూర్చు చెవి పండువయై”

అని మనసారా నమ్మి ఈ మహత్కార్యానికి ఉపక్రమించారు. ఆ నిష్ఠా నిధిత్వమే కిషన్ గారి ఈ ‘అభినవ పోతన’ చరిత్రమైన “శ్రీ వరద విజయము” కృతి – “తేనె నిండిన తీయని తెలుగు కుండ” గా రూపు దిద్దుకొనేందుకు దోహదపడింది.

ప్రస్తుత గ్రంథం “శ్రీ వరద విజయము” బృహత్కావ్య ప్రథమ భాగం మాత్రమే! ఈ భాగంలో .. వరదాచార్యుల వారి బాల్య దశ, కౌమార దశలో వాగీశ్వరీ వరప్రసాద ప్రాప్తితో కవిగా అవతరించడం, అనంతరం వివాహం వరకు చోటు చేసుకొన్నాయి.

శ్రీ పెండ్యాల కిషన్ శర్మ కవి – పోతన వలె, ‘అభినవ పోతన’ వలె సహజ కవి. ఆయన రచించిన పద్యాలన్నీ చిక్కని ధారతో, చక్కని శైలితో హృదయానికి హత్తుకొనేలా ఉన్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కృతిని చ(ది)వి చూసే పాఠకులు ఈ విషయాన్ని గ్రహిస్తారు.

తెలంగాణలో ఒక నానుడి ప్రచారంలో ఉండేది – “బ్రతికి బక్కయ్య శాస్త్రి పురాణం వినాలె .. చచ్చి స్వర్గానికి పోవాలె” అని. బక్కయ్య శాస్త్రి గారి కనిష్ట పుత్రులు వరదాచార్యులు గారు. ఆ తండ్రి గారి పుత్ర వాత్సల్యాన్ని కిషన్ శర్మ గారు వర్ణించిన పద్య రత్నం –

“వెన్నెల ధారలందు నిలువెల్లయు దోగుచు గంతులేయుచున్
అన్నల దమ్ములం గలిసి యాడుచు, పాడుచు నుండు వేళ – ‘నా
కన్నుల పంట! ర’మ్మనుచు కమ్ర కరాబ్జము లెత్తిపట్టి, బ
క్కన్నయె నేర్పె బాలునకు కమ్మని గొంతుక తోడి పద్యముల్!”

అట్లాగే .. గణిత పాఠాలు రుచించక బడి నుండి పారిపోయి వచ్చిన బాల వరదాచార్యులపై ఆయన తల్లి చూపిన మాతృప్రేమను వివరించిన పద్యం మరొక ఆణిముత్యం –

“బిరబిర వచ్చి తల్లి తన బిడ్డడి నక్కున జేరదీసి, ముం
గురులను దువ్వి, వీపునను కోమల హస్తముతో స్పృశించుచున్,
చెరగని మందహాసముల చిన్ని కుమారుని ముద్దు సేయుచున్,
తరగని మాతృప్రేమ రసధారల ముంచెడు …”

వరదాచార్యుల వారికి బాల్యంలో స్ఫూర్తి నిచ్చిన ‘గాంధీజీ’ పై పెండ్యాల వారు అల్లిన పద్యం రమణీయం –

“గోచిపాతను దప్ప కోర డెద్దానిని –
దర్పంబు లేని యాదర్శ మూర్తి!
ఒక చెంపపై గొట్ట నొక చెంప జూపించు
పరిపూర్ణ శాంత స్వభావ రాశి!
మాతృదాస్య విముక్తి మంత్ర జపంబున
చెరసాల పాలైన జెట్టి యతడు!
చేవ గల్గిన మమ్ము శిక్షింపుడని తెల్ల
దొరల బ్రశ్నించిన దోర్బలుండు! … ”

ఇంకా .. వరదాచార్యుల వివాహ ఘట్టంలోని ఈ పద్యం కమనీయం –

“సద్విజోత్తముల్ సుముహూర్త సమయ
మరసి
‘సావధాన’ యటంచు సుస్వరములొప్ప –
మంగళాష్టక పూర్వక మంత్ర కలిత
సేసబ్రాలను జల్లిరి శిరములందు!”

ఈ చిన్ని పద్యం – హిందూ వివాహంలోని ముహూర్త సన్నివేశాన్ని కళ్ళ ముందు నిల్పి, పాఠకుని కట్టిపడేస్తుంది.

వరదాచార్యుల వారిపై విరచించిన ఈ సత్కృతికి ఇట్లా నాలుగు మాటలు వ్రాసే
మహద్భాగ్యం నాకు ప్రాప్తించడం కాకతాళీయం కాదేమోనని నా అంతరంగాంతర్గత భావన! వరదాచార్యుల వారితో నాకు బాంధవ్యం ఉంది. “అన్నయై మన వరదన్న కాదిగురువు, వెన్నునకు బలభద్రుని విధముగాను వెన్నుదన్నుగ నిల్చిన పెన్నిధి”యైన శ్రీమాన్ ‘వానమామలై జగన్నాథాచార్యుల’ వారి పెద్ద కోడలు – నా సతీమణికి స్వయాన జ్యేష్ఠ సోదరి. అందుకే ఈ కృతి నా చేతి కందగానే నేను సద్యః పులకాంకుర శరీరుడనై పరవశించాను.

చివరిగా ఒక్క మాట –

“మల్లెపూవులోని మంచి గంధము తెల్గు –
కోకిలమ్మ తీపి కూత తెల్గు –
ఇంద్రధనువులోని యేడు రంగులు తెల్గు –
చంద్రకాంతిలోని సౌరు తెల్గు – ”

అన్న పద్యంలో కృతికర్త పెండ్యాల కిషన్ గారి అపరిమిత తెలుగు భాషాభిమానం ద్యోతకమౌతుంది.

కృతికర్త శ్రీ పెండ్యాల కిషన్ కవిని మనసారా అభినందిస్తూ – అతి త్వరలో మహాకవి ‘వానమామలై వరదాచార్యుల’ వారి చరిత్రం యొక్క మిగిలిన భాగాన్ని కూడ ఇంకా హృదయంగమంగా రచించి, సమగ్ర కావ్యంగా పాఠక లోకానికి అందించి, అశేష సాహిత్యాభిమానుల విశేషాదరణను పొందాలని ఆకాంక్షిస్తున్నాను.

                                                                                   ***

వ్యాఖ్యానించండి